న్యూఢిల్లీ : చార్జీల పెంపు, క్యాబ్ల్లో ఏసీ ఆన్ చేసేందుకు డ్రైవర్ల నిరాకరణ, దురుసు ప్రవర్తన వంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో క్యాబ్ ఆపరేటర్లు ఓలా, ఊబర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయని, సమస్యలు పరిష్కరించి పరిస్ధితులు చక్కదిద్దాలని స్పష్టం చేసింది. 15 రోజుల్లో నోటీసులకు బదులివ్వాలని కోరింది.
వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు క్యాబ్ అగ్రిగేటర్లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదును పరిష్కరించే సరైన వ్యవస్ధ లేకపోవడం, క్యాన్సిలేషన్ చార్జీలు అధికంగా ఉండటం సహా పలు ఫిర్యాదులు వచ్చాయని సీసీపీఏ పేర్కొంది. మే 10న క్యాబ్ అగ్రిగేటర్లతో సీసీపీఏ సమావేశం అనంతరం ఈ నోటీసులు జారీ అయ్యాయి.
సీసీపీఏతో జరిగిన సమావేశానికి ఓలా, ఊబర్, మెరు, ర్యాపిడో, జుగ్ను ప్రతినిధులు హాజరయ్యారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల వివరాలను ఈ సమావేశంలో తాము క్యాబ్ అగ్రిగేటర్ల దృష్టికి తీసుకువచ్చామని, ఫిర్యాదుల పరిష్కారానికి సరైన వ్యవస్ధను ఏర్పాటు చేయాలని వారికి సూచించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. క్యాబ్ అగ్రిగేటర్లు ఇలాంటి ఏర్పాట్లు చేయని పక్షంలో కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించామని స్పష్టం చేశారు. ఇక ఇంధన ధరలు పెరగడంతో పలు క్యాబ్ సర్వీసుల సంస్ధలు చార్జీల ధరలను గణనీయంగా పెంచాయి.