కమిటీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎలా ఉంటాయి? ఎజెండా ఏమని ఉంటుంది? అనేది రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మూడో అంశం. ఎంఎస్పీని మిగతా అంశాలతో చేరిస్తే కిచిడీ అవుతుందని రైతు నేతలు మొదట్నుంచీ వాదిస్తూనే ఉన్నారు. కానీ సర్కారు ఆ కిచిడీనే వండివార్చింది. ఎంఎస్పీని ప్రభావయుతంగా చేయాలంటే ఏంచేయాలి? ప్రకృతి వ్యవసాయం గురించి ఏం చేయాలి? పంటల వైవిధ్యీకరణ ఎలా చేయాలి? ఇవీ ఆ మూడు అంశాలు. రెండో అంశమైన ప్రకృతి వ్యవసాయంపై సర్కారు ఇదివరకే కమిటీ వేసింది. ఎంఎస్పీ విషయానికి వస్తే దానిని ప్రభావితం ఎలా చేయాలో సలహాలు ఇవ్వాలట. వ్యయాన్ని శాస్త్రీయంగా, పారదర్శకంగా ఎలా అంచనా వేయాలో సూచించాలట. పంటలను మెరుగుపర్చడం విషయంలో సలహాలు ఇవ్వాలట. ఈ పరిశీలనాంశాలతో ప్రభుత్వ కుట్ర స్పష్టమైపోయింది. ఇంకేముంది? ఈ కమిటీలో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయమై కనీసం చర్చ కూడా జరగదన్న మాట.
అది కమిటీ ఎజెండాలోనే లేదు. ఆ సంగతి మొత్తంగా తీసి అవతల పారేసింది. కొందరు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని అంటున్నారు. అది మంచిదా కాదా తేల్చండి అని కూడా కమిటీ ఎజెండాలో చేర్చలేదు. సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్లలో అత్యంత ప్రధానమైనదైన ఎంఎస్పీ చట్టబద్ధత అనే అంశాన్ని కమిటీ పరిశీలనాంశాల్లో నామరూపాలు లేకుండా చేసిన సర్కారు తెలివిగా కిసాన్ మోర్చా నాయకులనే కమిటీలో కూర్చుని చర్చిద్దాం రమ్మని పిలుస్తున్నది. ఇక చర్చ దేని గురించి? ఇక వ్యయాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం పైనా సర్కారు 2015లోనే కమిటీ వేయడం, సిఫారసులు అందుకోవడం జరిగిపోయాయి. ఆ కమిటీ చైర్మన్ రమేశ్చంద్ను ఈ కమిటీలోనూ చేర్చారు.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ప్రమాదకరమైన అంశం మార్కెటింగ్ వ్యవస్థను సంస్కరించడం గురించి. ఇది దొడ్డిదారిన మళ్లీ నల్లచట్టాలను తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నం తప్ప మరోటి కాదు. ముఖ్యంగా ఏపీఎంసీల గురించిన ఎజెండా అంశం. కమిటీ అంతిమంగా ఏం చెప్తుంది. పాత చట్టాలను మళ్లీ తెద్దామంటుంది. ఇటూఅటూ మార్చి కొత్తపేర్లు పెడదామంటుంది. ఇదీ నోటిపికేషన్ వెనుక కేంద్ర సర్కారు కుట్ర. ఇంకో విషయం ఏమిటంటే కమిటీకి ఓ కాలవ్యవధి అంటూ నిర్ణయించకపోవడం.
నివేదిక తప్పనిసరిగా అమలు చేస్తుం దా? లేక కేవలం సలహాలకే పరిమితమా? అనేది చెప్పలేదు. కమిటీ వేద్దాం.. చప్పట్లు కొడదాం.. మిఠాయిలు పంచుకుందాం.. ఎవరిండ్లకు వాళ్లు వెళ్లిపోదామన్నట్టుగా కమిటీ ఏర్పాటైంది. ఇది రైతు డిమాండ్లు నెరవేర్చేందుకు వేసిన కమిటీ కాదు.. వాటి మీద మట్టి గుమ్మరించేందుకు వేసిన కమిటీ. కమిటీ మార్గదర్శకాలపై స్పష్టత వచ్చేవరకు అందులో చేరే విషయం తేల్చబోమని చెప్పిన ఎస్కేఎం తన మౌలిక డిమాండ్లకు పూర్తి విరుద్ధంగా వేసిన కమిటీపై నేడోరేపో నోరు విప్పడమే మిగిలింది.