న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జనరల్ అనిల్ చౌహాన్కు జడ్ ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఢిల్లీ పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీడీఎస్ అనిల్ చౌహాన్ నివాసం, ఆయన పర్యటనల సందర్భంగా 33 మంది సాయుధ ఢిల్లీ పోలీసులు రక్షణగా ఉంటారు.
కాగా, తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత 9 నెలల పాటు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ను సీడీఎస్గా కేంద్రం నియమించింది. అలాగే ఆయనకు జనరల్ ర్యాంకు హోదా కూడా కల్పించింది. దేశ సైనిక చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి.
1961 మే 18న జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్లో చేరారు. శుక్రవారం సీడీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన త్రివిధ దళాల వ్యవహారాలపై రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ సలహాదారుడిగాను, సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను వ్యవహరిస్తారు.