మోదీ సర్కార్ కొత్త ఎత్తుగడలు
సాగు రుణాలపై ఎస్బీఐతో భాగస్వామ్య ఒప్పందాలు
ధాన్యం నిల్వ, రవాణా అప్పగించిన ఎఫ్సీఐ
పశ్చిమబెంగాల్లో రైస్మిల్లుల టేకోవర్ల పర్వం
అండమాన్లో ఆయిల్పామ్ సాగుకు యత్నాలు
వ్యతిరేకిస్తున్న ఆర్థికవేత్తలు, సామాజిక కార్యకర్తలు
హైదరాబాద్, ఏప్రిల్ 3 : నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐతో ఒప్పందం చేసుకొని రైతులకు రుణాలు ఇచ్చేదాకా.. ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అదానీ గ్రూపునకు చెందిన ‘అదానీ క్యాపిటల్’ కంపెనీకి, ఎస్బీఐకి గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం.. రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి కొనుగోలు చేసేందుకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా రుణాలు ఇస్తాయి. ఈ ఒప్పందంతో ఎస్బీఐకి అదానీ క్యాపిటల్ భాగస్వామిగా మారినట్టయ్యింది. ఈ ఒప్పందం పూర్తిగా అదానీకి ఉపయోగపడేదే తప్ప ఎస్బీఐకి లాభం చేకూర్చేది కాదు.
గణాంకాలు దీనిని తేటతెల్లం చేస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలను మారుమూల ప్రాంతాల రైతుల వద్దకు తీసుకెళ్లడంలో 59 బ్రాంచీలున్న అదానీ క్యాపిటల్ 22 వేలకుపైగా శాఖలున్న ఎస్బీఐకి ఏ విధంగా సాయపడుతుంది? 20 వేల మంది ఖాతాదారులున్న అదానీ క్యాపిటల్.. 45 కోట్ల ఖాతాదారులున్న ఎస్బీఐకి ఖాతాదారులను పెంచుకోవటంలో ఏ విధంగా తోడ్పడుతుంది? కేవలం 140 మం ది అదానీ క్యాపిటల్ ఉద్యోగులు.. 2.5 లక్షల మంది సుశిక్షితులైన ఎస్బీఐ ఉద్యోగులకు ఏ రకంగా సహకరిస్తారు? ఇదంతా ఎస్బీఐ యంత్రాంగాన్ని ఉపయోగించి అదానీకి లాభం చేకూర్చే పని అని తేటతెల్లమవుతున్నది. ప్రభుత్వరంగ బ్యాంకులతో కలిసి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం వల్ల రైతాంగం, చిన్నస్థాయి పరిశ్రమల మీద కార్పొరేట్ సం స్థలకు పూర్తి ఆధిపత్యం లభిస్తుందని ఆర్థిక నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఆర్థికమంత్రులతో కూడిన ‘పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ సర్వీసెస్’ ఆందోళన వ్యక్తంచేసింది. స్వాతంత్య్రానికి ముందు, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం లేని కాలం లో రుణాల కోసం ప్రజ లు వడ్డీవ్యాపారుల మీద ఆధారపడిన పరిస్థితులు మళ్లీ వస్తాయని ఆర్బీఐకి లేఖ రాసింది.
మిల్లులనూ వదలని కంపెనీ
రైసుమిల్లులను కూడా అదానీ గ్రూపు వదలటం లేదు. పశ్చిమబెంగాల్లో మూతపడిన మిల్లులను తీసుకొని నడుపుతున్నది. దీనిపై ఆ రాష్ట్రంలోని రైసుమిల్లుల యజమానులు, రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదానీ వంటి భారీ కంపెనీతో తాము ఎలా పోటీ పడగలమని, తమ మిల్లులను కూడా ఆ కంపెనీకి అమ్ముకునే పరిస్థితి వస్తుందని మిల్లు ఓనర్లు ఆవేదన చెందుతున్నారు. మొదట్లో రైతులకు అదానీ కంపెనీ భారీ ధరలిచ్చి ధాన్యం మార్కెట్ను కబ్జా చేస్తుందని, ఆ తరువాత రైతులు తాను చెప్పిన రేటుకే ధాన్యం అమ్మాల్సిన పరిస్థితిని సృష్టిస్తుందని రైతుసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
పామాయిల్ ఉత్పత్తిలో..
పామాయిల్ దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి మోదీ సర్కార్ గత ఏడాది 150 కోట్ల డాలర్ల వ్యయంతో ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ర్టాల్లో ఆయిల్పామ్ తోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతారు. దీనితో అండమాన్ నికోబార్లోని అనేక అరుదైన వృక్ష, జంతుజాతులు నశిస్తాయని పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం నిల్వ, రవాణాపై పట్టు
ధాన్యం నిల్వ, రవాణాపై కన్నేసిన అదానీ గ్రూపు ఆహారరంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నది. సహేతుకమైన కారణం లేకుండానే ధాన్యం నిల్వ, రవాణాను అదానీతో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అప్పగించింది. దీనితో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, నిల్వ సదుపాయాలు, రైల్వే రవాణా మార్గాలపై అదానీ గ్రూపు పట్టు సాధించింది. ఆ కంపెనీ పంట ఉత్పత్తులను కొని, ఆహార ఉత్పత్తులుగా మార్చి, మార్కెట్లో విక్రయిస్తున్నది. వ్యవసాయ కార్పొరేటీకరణకు ఇది నిదర్శనమని రైతు నేతలు చెప్తున్నారు.
కరెంటు పేరుతో రూ.50 వేల కోట్ల కుంభకోణం
అదానీ గ్రూప్ విద్యుదుత్పత్తి రంగంలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. కరెంటు ఉత్పత్తి కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, ఉపకరణాలు, యంత్రాల ధరలను తాము చెల్లించిన దానికన్నా చాలా ఎక్కువ చేసి చూపించి, ఆ మేరకు కరెంటును ఎక్కువ ధరకు అమ్ముకున్నట్టుగా అదానీతోపాటు ఇతర ప్రైవేట్ కంపెనీలపై విమర్శలున్నాయి. ఇది రూ.50,000 కోట్ల కుంభకోణం. దీనిపై ఎనిమిదేండ్లుగా కేంద్రప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి గానీ.. ముందుకు కదలటం లేదు. కారణం, అదానీకి కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలేనన్న విమర్శలున్నాయి.
వ్యవసాయ మార్కెట్లను నియంత్రించడానికి అదానీ కంపెనీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. ఆహార ధాన్యాల వ్యాపారాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నది. సాగుచట్టాల రద్దు ఆ కంపెనీ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐతో అదానీ క్యాపిటల్ ఒప్పందానికి కేంద్రం మార్గం వేసింది. దీనికి ఆరెస్సెస్ మద్దతు ఉన్నది. లేదంటే, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) అయిన అదానీ క్యాపిటల్తో ఎస్బీఐ వంటి దిగ్గజ బ్యాంకు ఎందుకు ఉమ్మడి రుణ మంజూరు ఒప్పందం చేసుకుంటుంది? సాగుచట్టాల రద్దు వల్ల కినుక వహించిన కార్పొరేట్ శక్తులను ప్రసన్నం చేసుకోవడానికి, వ్యవసాయరంగంలోకి ప్రవేశం కల్పించడానికి కేంద్రం ఈ పని చేసింది.
-థామస్ ఐజాక్, కేరళ మాజీ ఆర్థికమంత్రి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు