‘భారత్ ఎన్సీఏపీ’ పేరిట నూతన విధానం
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి..
టెస్టు ఆధారంగా కార్లకు స్టార్ రేటింగ్స్
రోడ్డు భద్రత మెరుగుపడేందుకు దోహదం
ఇంట్లో వాడే విద్యుత్తు ఉపకరణాలకు కంపెనీలు స్టార్ రేటింగ్స్ ఇస్తుంటాయి. వాటి రేటింగ్ను బట్టి వాటి మన్నిక, విద్యుత్తు వినియోగం తదితరాలను మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా కార్లకు కూడా స్టార్ రేటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాల్లో మరణాలను తగ్గించడానికి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన విషయం తెలిసిందే. ‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’(భారత్ ఎన్సీఏపీ) పేరిట క్రాష్ టెస్టులు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా వాహనాలకు రేటింగ్ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నది.
ఏమిటీ క్రాష్ టెస్టు?
అంతర్జాతీయ ఎన్సీఏపీని అనుసరిస్తూ భారత్ ఎన్సీఏపీని తీసుకొచ్చారు. గ్లోబల్ క్రాష్ టెస్టు ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ ఈ పరీక్షలు నిర్వహిస్తారు. వాహనాలకు 1 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్స్ ఇస్తారు. క్రాష్ టెస్టులో వాహనాల భద్రతా ప్రమాణాలను బట్టి ఈ రేటింగ్ ఇస్తారు. సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తూ తయారైన కారుకు క్రాష్ టెస్టు నిర్వహించి ఎక్కువ స్టార్లు ఇస్తారు.
టెస్ట్ ఎలా చేస్తారు?
నిజంగా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులను సృష్టించి వాహనాలకు క్రాష్ టెస్టు నిర్వహిస్తారు. టెస్టింగ్ ఏజెన్సీలు ఈ ప్రక్రియ అంతటినీ తమ నియంత్రణలో ఉంచుకుంటాయి. వాహనం భద్రతను విశ్లేషించేందుకు అనేక సెన్సర్లను ఉపయోగిస్తారు. హైటెక్ డమ్మీలను వాడుతారు. ప్రమాదం తీవ్రతను బట్టి అందులోని ప్రయాణికులకు వాహనం ఎంత మేర భద్రత కల్పించిందో చూస్తారు. ఈ టెస్టు ద్వారా సేకరించిన డాటాను విశ్లేషించి స్టార్ రేటింగ్ ఇస్తారు.
ఏ వాహనాలకు తప్పనిసరి?
3.5 టన్నుల కన్నా తక్కువ బరువున్న వాహనాలు. భారత్లో తయారు చేసిన వాహనాలు లేదా దిగుమతి చేసుకున్న వాహనాలు. డ్రైవర్ కాకుండా 8 మంది వరకు ప్రయాణికులు కూర్చొనే వాహనాలు. ఈ రకం వాహనాలకు ఎన్సీఏపీ టెస్ట్ వర్తిస్తుంది.
ప్రయోజనం ఏమిటి?
ఈ రేటింగ్స్తో వినియోగదారుడు అత్యధిక భద్రత కల్పించే వాహనాలను ఎంచుకునే వెసులుబాటు కలుగనున్నది. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గిస్తుంది. కార్ల ఎగుమతుల పెరుగుదలతో పాటు, వాహన రంగం స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదపడుతుంది.
తప్పనిసరి చేయొద్దు: మారుతీ సుజకీ
ఈ విధానాన్ని తప్పనిసరి చేయొద్దని మారుతీ సుజుకీ సూచించింది. ఐరోపాతో పోల్చుకుంటే భారత్ మార్కెట్ చాలా భిన్నమైనదని, ఐరోపా రేటింగ్స్ ఇక్కడ అమలు చేయాలని చూడటం సరికాదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ఇది ధనవంతులకు మాత్రమే మేలు చేస్తుందని పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులకు భద్రత కల్పించే విషయంలో కేంద్రం ఆలోచించాలని హితవు పలికారు.