హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సాగురంగ అభివృద్ధికి పాటుపడాల్సిందిపోయి.. నష్టం చేకూర్చే చర్యలను కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా, నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచడం కాకుండా ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండటం బాధాకరమన్నారు. కేంద్రం వ్యవసాయాన్ని ఎంతగా నీరుగార్చినా.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని స్పష్టంచేశారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పటిష్ఠంగా కార్యాచరణ కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. మరికొద్ది నెలల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంటల సాగుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్మిలన్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. వానకాలం సీజన్కు సంబంధించి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, ఇతర ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పురోగమిస్తున్న తెలంగాణ వ్యవసాయం
‘తెలంగాణలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉన్నది. సరిపడా వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆశాజనకంగా ఉండబోతున్నది. రైతులు యాసంగి పనులను ముగించుకొన్నరు. వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. ఈ లోపే ఎరువులు, విత్తనాలు సరిపడా సమకూర్చుకోవాలి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచాలి. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేడు తెలంగాణ వ్యవసాయం గొప్పగా పురోగమిస్తున్నది. ఉమ్మడి పాలనలో నామమాత్రంగా ఉన్న వ్యవసాయరంగం, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్ర జీఎస్డీపీకి 21% దోహదపడుతున్నది. ఇది మామూలు విషయం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయం కీలకంగా మారింది. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నది. మిగతా ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయి’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
విచ్చలవిడి ఎరువుల వాడకం తగ్గాలి
పంటల సాగులో విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూరియాతోపాటు ఇతర రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి శాస్త్రీయ పద్ధతులను అవలంబించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. అధిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూములు పాడవుతాయని చెప్పారు. పంటల మార్పిడి చేయకుండా ఒకేరకమైన పంటను ఏండ్లకొద్దీ సాగుచేయడం ద్వారా నేల సహజ స్వభావం తగ్గి, రోజురోజుకూ భూసారాన్ని కోల్పోతుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పంటల మార్పిడితో భూసారాన్ని పరిరక్షించుకోవడం తక్షణ అవసరమని అన్నారు. రానున్న వానకాలం సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీతోపాటు ఇతర ఎరువుల నిల్వలపై అధికారులను సీఎం ఆరాతీశారు. ఏ రకం ఎరువులు ఎంత అవసరమో.. ఎంత అందుబాటులో ఉన్నాయో లెక్కలు అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతానికి యూరియా, డీఏపీ నిల్వలు అవసరమైన మేరకు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు.
అన్నం అంతా ఒకేసారి తింటమా?
యూరియాతోపాటుగా ఇతర ఎరువులను కూడా ఎక్కువ మొత్తంలో వినియోగించడమే కాకుండా.. అధిక మొత్తంలో చల్లడంపై సీఎం కేసీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. యూరియా, ఇతర ఎరువుల వినియోగంపై వ్యవసాయ అధికారుల సలహాలను రైతులు తీసుకోవాలని సూచించారు. ‘కొందరు రైతులు ఎరువులు ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతదని అనుకొంటరు. కానీ అది సాధ్యంకాదు. ఏదైనా మోతాదుగా వాడుకోవాల్సిందే. మనం అన్నం తింటే ఒకేసారి తింటమా? తినలేము కదా! ఎరువులు కూడా అంతే.. పంటలు కూడా మానవ శరీరంలాంటివే. వాటికి ఆహారం ఎంత కావాల్నో అంతే తీసుకొంటయి.
మోతాదుకు మించి తిండి తింటే మనకు రోగాలు వచ్చినట్టు.. వరిపంటకు కూడా మోతాదు మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది’ అని సీఎం కేసీఆర్ వివరించారు. ఎకరానికి ఒక యూరియా బస్తాను ఒకేసారి వేయవద్దని.. వరి పెరుగుతున్నకొద్దీ సమయానుకూలంగా మూడునాలుగు సార్లు వినియోగించాలని సూచించారు. డీఏపీ, తదితర కాంప్లెక్స్ ఎరువులను కూడా విపరీతంగా వాడకుండా తగు పాళ్లలో వాడాలని హితవుచెప్పారు. మారుతున్న కాలాన్ని బట్టి ఎరువులను ఎట్లా వినియోగించాలో.. వ్యవసాయాధికారులు రైతు వేదికల ద్వారా రైతులను సమావేశపరచి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు దిగుమతి కష్టమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భూసారాన్ని పెంచే దిశగా కార్బన్ కంపోనెంట్ల వాడకాన్ని వినియోగించాలని, పచ్చిరొట్ట వాడకాన్ని పెంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
వరికి ప్రత్యామ్నాయం అవసరం
వరిని అధిక విస్తీర్ణంలో సాగుచేయడం ద్వారా భూసారం తగ్గిపోయే ప్రమాదమున్నదనే శాస్త్రీయ అధ్యయనాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో లాభదాయక పంటల మార్పిడి దిశగా రైతులను చైతన్యపరిచి, వాటి సాగుకోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం పంట పొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏఈ అధికారులకు నిరంతరం శిక్షణ తరగతులను నిర్వహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డికి సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై జాబ్ చార్ట్ తయారు చేయాలన్నారు. వరిసాగులో నాటుకు బదులు వెదజల్లుడు విధానాన్ని మరింతగా ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించవచ్చన్నారు. వీటన్నింటిపైనా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించి, విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ పత్తికి డిమాండ్
కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లో చైనా తదితర దేశాల పత్తి దిగుబడి తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ పత్తికి డిమాండ్ పెరుగుతున్న అంశంపై సీఎం సమీక్షించారు. క్వింటాల్ పత్తికి రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ధర పలుకుతున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. రానున్న కాలంలో మరింతగా పత్తికి డిమాండ్ పెరుగుతుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సీజన్లో పత్తి సాగును మరింతగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే సందర్భంలో మిర్చి పంటకు కూడా ఊహించని రీతిలో క్వింటాల్కు రూ.42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయమని అన్నారు. కంది కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటేనని, కందిసాగు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. సన్ఫ్లవర్ పంట విస్తీర్ణాన్ని కూడా పెంచాలని సూచించారు.
విత్తన కల్తీపై ఉక్కుపాదం
కల్తీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడిక్కడ దాడులు చేస్తూ నియంత్రించాలన్నారు. కల్తీ ముఠాల మూలాలను గుర్తించి కట్టడి చేయాలని చెప్పారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ఇప్పటినుంచే ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించాలన్నారు.
తెలంగాణకు కరువన్నదే రాదు
భవిష్యత్తులో తెలంగాణకు కరువు సమస్యే ఉత్పన్నం కాదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ నిరంతరం వైబ్రంట్గా, బిజీబిజీగా ఉండాలని, ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలను చేపట్టడంతోపాటు, రైతులకు పంటలసాగుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రికి, అధికారులకు సూచించారు. జిల్లాలవారీగా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రణాళికలో జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలను భాగస్వాములను చేయాలని, ఆయా జిల్లాల్లో భౌగోళిక పరిస్థితులు, వాతావరణాన్ని గుర్తించి, తదనుగుణంగా పంటల సాగుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం సేకరణపై ఆరా…
యాసంగి ధాన్యం కొనుగోళ్లు.. ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ కొనుగోళ్ల ప్రక్రియ తీరును సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పుంజుకొన్నదని, గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితర అవసరాలను సమకూర్చుకొన్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,983 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 536 కేంద్రాలను ప్రారంభించామన్నారు. 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలైందని, 1,200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని సీఎంకు కమిషనర్ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సీఎం కార్యదర్శులు భూపాల్రెడ్డి, రాహుల్ బొజ్జా, స్మితా సబర్వాల్, వీ శేషాద్రి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఏడీ విజయ్కుమార్, జేడీ రాములు తదితరులు పాల్గొన్నారు.