న్యూఢిల్లీ: ప్రభుత్వంపై విష ప్రచారం నిర్వహిస్తున్న పాకిస్థాన్కు చెందిన 60 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు ఇవాళ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ బదులిస్తూ.. ఆ 60 ఛానళ్లకు చెందిన ట్విట్టర్, ఎప్బీ, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా అకౌంట్లను కూడా నిలిపేసినట్లు ఆయన తెలిపారు. భారత ప్రభుత్వంపై ఆ ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్టుల ఎథికల్ కోడ్కు సంబంధించిన మంచి చెడులను చూసుకుంటుందన్నారు. పీసీఐలోని 14వ సెక్షన్ ప్రకారం అనైతికంగా వ్యవహరించే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పటి వరకు ఆ సెక్షన్ ప్రకారం 150 మంది జర్నలిస్టులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నకిలీ వార్తలను చెక్ చేసేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను సమాచార, ప్రసార శాఖలో ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఫేక్ వార్తల గురించి తెలుసుకునేందుకు ఆ యూనిట్కు మెయిల్ కానీ లేఖ కానీ రాయవచ్చు అన్నారు. ఫేక్ న్యూస్కు సంబంధించి ఇప్పటి వరకు 13 వేల ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. మహిళా జర్నలిస్టుల వేధింపు అంశం ఐపీసీ కిందకు వస్తుందని, అది ఆయా రాష్ట్రాల పరిధిలో ఉంటుందని మంత్రి సమాధానం ఇచ్చారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం పది మంది సభ్యుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై తమ శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కోవిడ్ సమయంలో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు 6.15 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.