కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ తన విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సవాల్ విసిరిన గెహ్లోత్… తాజాగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీడియా గొంతును నొక్కేస్తోందంటూ విమర్శించారు. ఎంత సేపూ మతపరమైన విషయాలనే చూపిస్తూ, ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేసేలా చేస్తున్నారంటూ గెహ్లోత్ ఆరోపించారు.
మీడియా స్వేచ్ఛ విషయంపై 180 దేశాల్లో సర్వే చేస్తే, ఈ విషయంలో భారత్ 150 వ స్థానంలో నిలిచిందని గెహ్లోత్ పేర్కొన్నారు. దేశంలో మీడియా కష్టాలేంటో ఈ సర్వే చెబుతోందని ఎద్దేవా చేశారు. మీడియా కేంద్రం ఒత్తిడికి తలొగ్గొద్దని, ప్రజల పక్షాన నిలవాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీడియాను అణచేస్తున్నారని, ఈ చక్రం ఇలా తిరుగుతూనే వుందని ఆయన విమర్శించారు. మీడియా మొత్తం కూడా బీజేపీ, ఆరెస్సెస్ అండదండలతోనే నడుస్తోందంటూ గెహ్లోత్ ఫైర్ అయ్యారు.