శత్రువును సైతం ఒప్పించగలిగినవాడే వీరుడు. ప్రత్యర్థినిసైతం మెప్పించగలవాడే పాలకుడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నా..అసలు నిజమేమిటో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇస్తున్న అవార్డులే నిరూపిస్తున్నాయి.
గత ఏడు రోజుల్లో తెలంగాణకు ఐదు కీలక విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరనేలేదని కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడినా, ఆ మాటలు పచ్చి అబద్ధమని కేంద్రంఇచ్చిన ఉత్కృష్టతా పురస్కారం నిరూపించింది. తాజాగా హర్ ఘర్ జల్ తమదేనని కేంద్రం ఎంత బాకా ఊదుతున్నా.. ఆ పథకానికి ఆది బిందువు మిషన్ భగీరథేనని మరోసారి నిరూపితమైంది.
కేసీఆర్ మదిలో బిందువుగా జన్మించి ప్రతి ఇంటిలో నీళ్లయి చిందేస్తున్న మిషన్ భగీరథకు జాతీయ అవార్డు లభించింది. రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు ఎంతటి అసత్యాలో, ఎంతటి అసంగతాలో చెప్పేందుకు ఈ అవార్డులే నిదర్శనం. పథకాలపై బీజేపీ నేతలు నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిస్తున్నా, కేంద్రానికి మాత్రం అవార్డులు ఇచ్చితీరాల్సిన అనివార్యత నెలకొంటున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలాలను అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర పురస్కారం లభించింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. అక్టోబర్ రెండున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు జాతీయ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్.. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్కు బుధవారం లేఖ రాశారు. దేశంలోనే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రశంసించారు. నల్లా నీటిని అందించడంలో ఆదర్శమైన పనితీరును కనపర్చిందని పేర్కొన్నారు. అవార్డు అందించడం ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనానికి నీటి సరఫరా ఎంతో తోడ్పడుతుందని ఆశిస్త్తున్నట్టు వెల్లడించారు. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఇప్పటికే రాష్ర్టానికి 13 అవార్డులొచ్చాయి. ఈ అవార్డులు అందుకోవడానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనున్నది.
కేంద్ర జల్జీవన్ మిషన్కు కృతజ్ఞతలు
మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అవార్డును ప్రకటించిన కేంద్రాకి, జల్జీవన్ మిషన్కు ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోని ప్రతి ఆవాసానికీ రక్షిత తాగునీరు అందుతున్నదని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడింది. ఈ పథకం అమలుతీరును ఇటీవల జల్ జీవన్ మిషన్ స్వయంగా పరిశీలించిందని, 320 గ్రామాల్లో స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించిందని, నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలించడమేగాక, ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిందని గుర్తుచేసింది.
అవార్డులు బాధ్యతను పెంచుతాయి
ఇంటింటికి శుద్ధ జలాలు అందించే మిషన్ భగీరథకు కర్త, కర్మ క్రియ అన్ని సీఎం కేసీఆరే. ఈ అవార్డు ఘనత ఆయనదే. భగీరథలో కృషిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు. ఇలాంటి అవార్డులు మా బాధ్యతను మరింత పెంచుతాయి. సీఎం ఆశీర్వాదాలు, మంత్రి కేటీఆర్ సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. గ్రామాల్లో మహిళలు బిందెలు పట్టుకొని బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాం.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు