న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్నది. మూడో దశ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషనే కీలకమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. టీకాల పంపిణీ వేగవంతం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పని కేంద్రాల్లో కొవిడ్ టీకా వేసేందుకు గతంలో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పటి వరకు కేవలం ఉద్యోగులకు మాత్రమే టీకాలు వేస్తున్నారు. తాజాగా టీకా డ్రైవ్లో ఉద్యోగుల కుటుంబీకులు, వారిపై ఆధారపడ్డ వారికి టీకాలు వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు శనివారం కేంద్రం ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ అవసరమైన వాళ్లలో 45 సంవత్సరాలు పైబడిన వారి కోసం కేంద్రం రాష్ట్రాలకు అందించే కోటా నుంచి ఉచితంగా టీకాలు వేయనున్నారు. 18-44 సంవత్సరాల మధ్య వయస్సు గల లబ్ధిదారులకు వ్యాక్సిన్ తయారీదారుల నుంచి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన కోటా నుంచి ఇవ్వాలని సూచించింది.