భూతాపం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకునే సహజసిద్ధమైన అత్యుత్తమ పరిష్కారం అడవుల పరిరక్షణ. సమస్త జీవజాలానికి పొదరిల్లుగా నిలుస్తూ.. పుడమితల్లిని చల్లబరుస్తున్న ఈ అరణ్యాలను ఇంతకాలం ‘అటవీ పరిరక్షణ చట్టం1980’ కవచంలా కాపాడుతున్నది. అయితే సవరణల పేరిట ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కార్పొరేట్లకు మేలుచేకూర్చేలా సవరణలు చేస్తున్న కేంద్రం వైఖరిపై పర్యావరణ ప్రేమికులు, నిపుణులతో పాటు విపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ చట్టం? కొత్తగా తీసుకొస్తున్న సవరణలు ఏమిటి? దీంతో జరుగబోయే నష్టాలేమిటి? తదితర అంశాలపై సమగ్ర కథనం..
1920ల్లో బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన అటవీ చట్టానికి కొనసాగింపుగా 1980లో అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. అటవీ భూముల రక్షణ, చెట్ల నరికివేత నిర్మూలనే దీని లక్ష్యం. 1988లో ఒకసారి, 1996లో మరోసారి ఈ చట్టానికి సవరణలు చేశారు.
అటవీ భూముల మళ్లింపునకు చట్టపరంగా ఉన్న కఠిన నియంత్రణలను ఎత్తివేయడమే లక్ష్యంగా ఈ చట్టంలో కొత్తగా సవరణలు తీసుకువస్తున్నట్టు స్థూలంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ప్రతిపాదనల ప్రకారం..
హడావుడిగా చర్యలు
అటవీ పరిరక్షణ చట్ట సవరణ కోసం కేంద్రం హడావుడిగా వ్యవహరిస్తున్నది. తాజా ప్రతిపాదనలపై వచ్చే 15 రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని విపక్షాలను, ప్రజలను కోరింది. దీనిపై పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇంత హడావుడిగా ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరమేమున్నదని ప్రశ్నిస్తున్నాయి. కాగా.. రెండు దఫాల్లో చేసే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తాజా ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చిస్తుంది. ఆ తర్వాత పార్లమెంటు ముందుకు ప్రతిపాదనలు వెళ్తాయి. అక్కడ ఆమోదం పొందితే అటవీ పరిరక్షణ చట్టానికి మరోసారి
సవరణలు చేస్తారు.