లక్నో: కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్ యూపీలో కరోనా పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఘాటైన లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహించే బరేలీ నియోజకవర్గంలో ఆక్సిజన్ కు కొరత ఉందని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు నల్లబజారులో అమ్ముతున్నారని ఆ లేఖలో గాంగ్వార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని సీఎం ప్రకటించిన పక్షం రోజుల్లోనే కేంద్ర మంత్రి ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోగ్యశాఖలోని సిబ్బంది ఫోన్లు ఎత్తరని, కోవిడ్ రోగులకు దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉందని గాంగ్వార్ తెలిపారు. బరేలీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో కరోనా రోగులను చేర్చుకునే ప్రక్రియ సరళతరం చేయాలని సూచించారు. ఈ లేఖ గురించి గాంగ్వార్ను మీడియా ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన సూచనలను తాను సీఎంకు చేరవేశానని సమాధానమిచ్చారు. ప్రజలు లేవనెత్తిన అంశాలు నిజమైనవేనని భావిస్తున్నట్టు చెప్పారు. వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఆక్సిజన్ సమస్య తాత్కాలికం కావచ్చని, దానిని పరిష్కరించవచ్చని అన్నారు. కానీ నల్లబజారులో అమ్మడం జరగకూడదని అన్నారు.