నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతును రాజును చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతు నడ్డి విరిచే పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కొంత కాలంగా ధర్నా చేస్తున్న అన్నదాతలను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతును విస్మరించడం సరికాదన్నారు. దేశానికే ఆదర్శంగా రైతు పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలతో రానున్న రోజుల్లో అన్నదాతలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.