రాబోయే రోజుల్లో సీఆర్పీఎఫ్ మోహరింపు అవసరం లేని జమ్మూ కశ్మీర్ను చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్, నక్సల్స్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో ఈ మూడు ప్రాంతాల్లో ఈ బలగాల అవసరం ఉండకపోవచ్చని విశ్వసిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సీఆర్పీఎఫ్ 83 వ రైజింగ్ పరేడ్ శ్రీనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ మూడు ప్రాంతాలూ పూర్తి శాంతియుత ప్రాంతాలుగా అవుతాయని, ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ఈ క్రెడిట్ మొత్తం సీఆర్పీఎఫ్ బలగాలకే దక్కుతుందని అమిత్షా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో కేంద్ర బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయని ఆయన ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదంపై భద్రతా బలగాలు పూర్తి పట్టు సాధించాయని,ఇదో పెద్ద విజయమని ఆయన చెప్పుకొచ్చారు.