ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లో నేషనల్ పోలీసు అకాడమి (ఎన్పీఏకు) ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఆయన పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. దేశభద్రతలో రక్షణరంగ సంస్థల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. రక్షణరంగ సంస్థల్లో ఎంతో పటిష్టమైన ఎన్ఎస్జీ, ఆక్టోపస్, బీడీఎల్ వంటి సంస్థలు కూడా ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు కావడం ఎంతో శుభపరిణామమన్నారు. వీటికి సమీపంలోనే ప్రభుత్వం నేషనల్ పోలీసు అకాడమికీ ప్రభుత్వం 391 ఎకరాలను కేటాయించిందన్నారు.
ఇబ్రహీంపట్నం సమీపంలో ఎన్పీఏకు కేటాయించిన స్థలంలో త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ఇక్కడే అత్త్యున్నత పోలీసుల శిక్షణ కూడా ఇక్కడే ఇవ్వనుందన్నారు. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. ఎన్పీఏ పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నేషనల్ పోలీసు అకాడమిని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తే మరింతమంది ఉన్నతాధికారులను తయారు చేసుకునేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నేషనల్ పోలీసు అకాడమికి కేటాయించిన భూముల సమీపంలో ఉన్న రామోజీ ఫిలింసిటి, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, బీడీఎల్తో పాటు ఇతర సంస్థలకు సంబంధించిన వివరాలను డిజిటల్ మానిటర్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు.
ఎన్పీఏ అకాడమి భూముల పరిశీలనలో భాగంగా మంత్రి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు మానవాలి మనుగడకు ఎంతో మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని అందించన వారమవుతామన్నారు. మొక్కలు నాటడంతో ప్రతి ఒక్కరూ ముఖ్యపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ఎన్పీఏ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సతీష్బోనా, ఎన్పీఏ జాయింట్ డైరెక్టర్ అమీద్గర్గ్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఆర్డీవో వెంకటాచారి, ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ సైదులు, తాసీల్దార్ వెంకటేశ్వర్లుతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.