హైదరాబాద్ : ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్, అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి దుర్గా శంకర్ మిశ్రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. అమృత్, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం స్వనిధి, హౌజింగ్ ఫర్ ఆల్ లాంటి పథకాల పురోగతిపై కేంద్ర కార్యదర్శి నగరంలోని బీఆర్కేఆర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అమలులో సాధించిన పురోగతిని గుర్తించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అర్బన్ స్కీంలను సీనియర్ మున్సిపల్ అధికారులు వివరించారు.
సమావేశం అనంతరం కేంద్ర కార్యదర్శి లక్డీకాపూల్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఫతుల్లాగూడలోని జంతు సంరక్షణ కేంద్రం, వనస్థలిపురంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, రహదారులు, భవనాలు, హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కేంద్ర జాయింట్ సెక్రటరి సంజయ్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అదనపు కమిషనర్ యూసీడీ శంకరయ్య, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వల్లురి క్రాంతి, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (పిహెచ్) శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.