న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ముప్పు తప్పకపోవచ్చన్న నిపుణుల హెచ్చరికల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహమ్మారికి మెరుగైన చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కొవిడ్ 19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ తయారీ (ECRP-2) ప్యాకేజీ కింద ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,827కోట్లు విడుదల చేసింది. ప్యాకేజీ కింద మొత్తం రూ.120,185 కోట్లు కేటాయించగా.. ఇందులో శనివారం 15శాతం నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. రాష్ట్రాలకు వారీగా నిధుల కేటాయింపు వివరాలను తెలిపారు.
ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.281.98కోట్లు, బిహార్కు రూ.132కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.131కోట్లు.. తెలంగాణకు రూ.44.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.62.69కోట్లు కేంద్రం కేటాయించింది. అయితే, ఈ నిధులతో ఆరోగ్య వసతులను మెరుగుపరచడం ద్వారా కొవిడ్ను సమర్థంగా నియంత్రించాలని కేంద్రం గతంలో మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, బాధితులను వేరుగా ఉంచేలా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొవిడ్ చికిత్స కేంద్రాల్లో బెడ్లు, పీపీఈ కిట్లు తదితర సామగ్రిని, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ఆక్సిజన్ లభ్యతను తదితర అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్గదర్శకాల్లో మార్పులు చేసుకునేందుకు సైతం వీలు కల్పించింది.