న్యూఢిల్లీ: ఆకలి సూచీలో భారత్ దాదాపు అట్టడుగుకు చేరడంతో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి దుమ్మెత్తిపోశారు. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్ ర్యాంకు 107వ స్థానానికి దిగజారడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ, అనైతిక నిర్ణయాలవల్లే దేశం ఆర్థికంగా వెనుకబడి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
దేశ పరిస్థితిపై అంతర్జాతీయంగా వెల్లడయ్యే ఏ లెక్కలను కూడా మోదీ ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా లేదని సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో భారత్ అన్నిరంగాల్లో వెనుకబడిందని మండిపడ్డారు. అందుకే అంతర్జాతీయంగా ఏ నివేదిక వచ్చినా భారత్ అడుగున ఉంటున్నదని, ప్రభుత్వం మాత్రం వాటిని తప్పుడు లెక్కలుగా కొట్టిపారేస్తున్నదని ఆయన విమర్శించారు.
ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంటే కేంద్రం మాత్రం రాజకీయ లబ్ధి కోసం జనాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కడ చూసినా బీజేపీ హింసా రాజకీయాలే చేస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని ఆర్థికంగా ఎలా గట్టెంకించాలనే సోయి మాత్రం బీజేపీ సర్కారుకు రావడంలేదని సీతారాం ఏచూరి ఫైరయ్యారు.