హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ అవార్డులు బుధవారం ప్రకటించింది. మూడు కేటగిరీల్లో కలిపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 12 అవార్డులు ప్రకటించింది. జాతీయ స్థాయిలో 9 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు, 2 ఉత్తమ మండల పరిషత్, 1 ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డులు రాష్ట్రానికి లభించాయి.
ఉత్తమ జిల్లా పరిషత్- మెదక్.. కోరుట్ల, ధర్మారం లకు మండల పరిషత్ అవార్డులు.. కరీంనగర్ జిల్లాలోని పర్లపల్లి గ్రామ పంచాయతీ, సిరిసిల్ల జిల్లాలోని హరిదాస్నగర్, మోహినికుంట పంచాయతీలకు, సిద్ధిపేట జిల్లా మిట్టపల్లె, మల్యాల పంచాయతీలకు, ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి పంచాయతీ, మహబూబ్నగర్ జిల్లా చక్రాపూర్ పంచాయతీ, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామ పంచాయతీకి అవార్డులు లభించాయి.
రాష్ర్టానికి 12 జాతీయ అవార్డులు లభించడంపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కృషి, ముందుచూపు, చొరవ, మార్గదర్శనం వల్లే అవార్డులు లభించినట్లు తెలిపారు. ప్రతి ఏటా దేశంలోనే ఉత్తమ జిల్లా, మండల, గ్రామ పంచాయితీలుగా తెలంగాణ ప్రాంతాలు ఎంపిక అవుతున్నట్లు పేర్కొన్నారు.