నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రైతు సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టిన మరునాడే ప్రధాని మోదీ నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయడం స్వాగతించదగిన పరిణామమని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్రెడ్డితో కలిసి శనివారం నల్లగొండలో గుత్తా మీడియాతో మాట్లాడారు. ఈ వానకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్నా.. ఎంతమేర చేస్తారో చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్తున్న కేంద్రం.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేయాలని కోరారు. ధాన్యం విషయంలో ఓ వైపు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం కల్లాల వెంట తిరుగుతూ రైతులను రెచ్చగొట్టాలనుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఎవరి మెడలు ఎవరూ వంచారో కేంద్ర చట్టాల రద్దుతో అందరికీ తెలిసొచ్చిందని చురకలంటించారు. ప్రధాని మోదీనే స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని, ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని హితవు పలికారు. చేతనైతే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని బండికి సూచించారు. రైతులు కూడా పంటమార్పిడిపాటిస్తూ.. అధిక ఆదాయం ఇచ్చే పంటల దిశగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.