అమరావతి : దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేస్తుందని బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఖండించారు. ఏపీ అప్పుల గురించి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబడుతూ కేంద్రం అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం వైఖరిని ఎందుకు తప్పుబట్టడం లేదని , సత్తా ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని హితవు పలికారు.
విశాఖ జిల్లాలో భూ సేకరణపై పిల్ కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన భూ సేకరణతో విశాఖ జిల్లాలో లక్షా 84 వేల మందికి మేలు జరుగనుందని అన్నారు. భీమిలి, అనకాపల్లి, వెస్ట్, విశాఖ ఈస్ట్, సౌత్, నార్త్ తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. భూ సేకరణతో 6,116 ఎకరాల్లో ఒక్కొక్కరికి 70 గజాలు ఇళ్ల స్థలం అందుతుందని అన్నారు.
తమ ప్రభుత్వం విద్య, వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చూసి ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఓర్చుకోలేక పోతున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.