హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులపై కేంద్రం మరో పిడుగు వేసింది. ఈ యాసంగి సీజన్కు ఎరువుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. గత యాసంగి కంటే 4.29 లక్షల టన్నులు తక్కువగా కేటాయించింది. వరిసాగుకు అత్యధికంగా అవసరమైన యూరియా, కాంప్లెక్స్ ఎరువుల్లోనే భారీగా కోత పెట్టింది. గత యాసంగిలో తెలంగాణకు మొత్తం 20.50 లక్షల టన్నుల వివిధ రకాల ఎరువులను కేటాయించగా ఈ యాసంగిలో 16.21 లక్షల టన్నులకు తగ్గించింది.
యూరియా కేటాయింపులను 8.50 లక్షల టన్నుల నుంచి 7.89 లక్షల టన్నులకు కుదించింది. అంటే 61 వేల టన్నులు కోత పెట్టింది. కాంప్లెక్స్ ఎరువుల్లోనూ 2.34 లక్షల టన్నులకు కోత పెట్టింది. కాంప్లెక్స్ ఎరువుల కేటాయింపులు 8.10 లక్షల టన్నుల నుంచి 5.76 లక్షల టన్నులకు తగ్గించింది. ప్రస్తుత వానకాలం సీజన్ కేటాయింపులతో పోల్చినా ఇవి తక్కువే. వానకాలంలో రాష్ర్టానికి మొత్తం 24.45 లక్షల టన్నుల ఎరువులు కేటాయించింది. ఇందులో యూరియా 10.50 లక్షల టన్నులు కాగా కాంప్లెక్స్ ఎరువులు 9.40 లక్షల టన్నులు ఉన్నాయి. రాష్ట్రంలో యాసంగి సాగు వానకాలం సాగుతో పోటీ పడుతున్నది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ ఎరువులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కానీ, కేంద్రం కోతలు విధించడం ఆందోళన కలిగిస్తున్నది.
వరి సాగు పెరిగితే.. ఎరువులకు కొరతే!
రాష్ట్రంలో ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎరువులకు కటకట తప్పదు. వరికి ప్రధానంగా కావాల్సిన యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కేటాయింపుల్లో కేంద్రం కోత పెట్టడమే ఇందుకు కారణం. ఈ యాసంగిలో వరి సాగు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. గత యాసంగిలో కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా 35.84 లక్షల ఎకరాలకే వరిసాగు పరిమితమైంది. అంతకుముందు 2020-21 యాసంగిలో 53 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర అవసరాలకు తగినవిధంగా ఎరువులు కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.