హైదరాబాద్ : పట్టణ ప్రాంత అడవుల నిర్వహణ, సమీప నివాస ప్రాంతాలకు పర్యావరణ సమతుల్యత అందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రతినిధి బృందం ప్రశంసించింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిలో తెలంగాణ దేశానికి నాయకత్వం (లీడర్ ఇన్ ద కంట్రీ) వహిస్తుందనడంలో సందేహం లేదని బృందం అభిప్రాయపడింది. ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడింది. తెలంగాణలో రక్షిత అటవీ ప్రాంతాలు, వాటి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించింది.
రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, కర్ణాటక మాజీ పీసీసీఎఫ్ బీకే సింగ్ నేతృత్వంలో పీకే మాథుర్, డాక్టర్ పీఎస్ ఈసా, డాక్టర్ సీ రమేశ్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో ఉన్న నలుగురు సభ్యులు కూడా రక్షిత అటవీ ప్రాంతాల నిర్వహణ, అభివృద్ధిలో నిపుణులు. సంగారెడ్డి జిల్లా మంజీరా, మహబూబాబాద్ జిల్లా పాకాల అభయారణ్యంతో పాటు హైదరాబాద్ శివారు మహావీర్ హరిణ వనస్థలి, మరికొన్ని అటవీ ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. క్షేత్ర స్థాయి పర్యటన పూర్తి అయిన తర్వాత అరణ్య భవన్లో కమిటీ సభ్యులు, అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభతో పాటు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
తెలంగాణ అడవులు, ముఖ్యంగా పట్టణాలు, ఆవాసాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలను నిర్వహిస్తున్న తీరుపై పీసీసీఎఫ్ వివరించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి అద్భుతంగా ఉందని, రానున్న రోజుల్లో ఇవి చక్కని పర్యావరణ కేంద్రాలుగా మారుతాయని కమిటీ సభ్యులు మెచ్చుకున్నారు. రక్షిత అటవీ ప్రాంతాల నిర్వహణ కూడా బాగుందని, క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది ఉత్సాహంతో పనిచేస్తున్నందువల్ల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖకు కమిటీ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. అభయారణ్యాలకు సమీపంలో నివసించే వారిలో పర్యావరణ సృహ మరింత పెంచాలని, అడవుల రక్షణలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు.
మంజీరాలో పక్షుల ఆవాసాలు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చుట్టూ విపరీతంగా పట్టణీకరణ జరిగినా హైదరాబాద్ హరిణ వనస్థలి నిర్వహణ చాలా బాగుందని, గడ్డి మైదానాలను ఎక్కువగా పెంచాలని సూచించారు. అలాగే జంతువులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా అన్ని అటవీ బ్లాకులను కలుపుతూ ఎకో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. పాకాలలో మరిన్ని బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి, మొబైల్ పార్టీల పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. అభయారణ్యాల్లో జంతువులు, చెట్ల రకాల డేటా బేస్ను తయారు చేయాలని, భవిష్యత్ అధ్యయనాలకు ఇవి పనికి వస్తాయని సూచించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ (అడ్మిన్, విజిలెన్స్) స్వర్గం శ్రీనివాస్, అడిషనల్ పీసీసీఎఫ్లు సిద్దానంద్ కుక్రేటీ, ఎస్ కే సిన్హా, ఎంజే అక్బర్, ఓఎస్డీ శంకరన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.