హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ 21 సంవత్సరాల పయనం లో ఈ విజయదశమి ప్రత్యేకమైనది. టీఆర్ఎస్ పేరుతో నిర్వహించే ఆఖరి సర్వసభ్య సమావేశం కావడంతో బుధవారం తెలంగాణభవన్ ప్రాం గణమంతా ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. పార్టీ జాతీయస్థాయికి విస్తరిస్తున్నదన్న ఉత్సాహం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీ తన లక్ష్యాన్ని ముద్దాడి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికి మార్గదర్శనం చేసే స్థాయికి చేరుకున్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించాలని దేశవ్యాప్తంగా వినతులు వెల్లువెత్తడంతో పార్టీని బీఆర్ఎస్గా మార్చే అ ద్భుత ఆవిష్కరణకు తెలంగాణభవన్ వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇలా మొత్తం 283 మంది సభ్యులతో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఉదయం 10 గంటల నుంచే కోలాహలం
రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధు ల రాక ఉదయం 10 గంటల నుంచే మొదలు కావడంతో తెలంగాణ భవన్ కోలాహలంగా మారింది. సమావేశ మందిరంలో వేదిక మీద సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు, విడుదలై చిరుతగళ్ కట్చి (వీసీకే) అధినేత, ఎంపీ, తిరుమావళన్, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి రైతు సంఘాల ప్రతినిధులు కూర్చొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణభవన్లో కేసీఆర్కు స్వాగతం
సీఎం కేసీఆర్ సరిగ్గా 12.12 గంటలకు తెలంగాణభవన్కు చేరుకున్నారు. ఆయన వెంట కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గాదరి కిశోర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాకేశ్ తదితరులు కేసీఆర్కు స్వాగతం పలికారు. కుమారస్వామికి సీఎం కేసీఆర్ పార్టీ నేతలను పరిచయం చేస్తూ లోపలికి తోడ్కొని వెళ్లారు. తెలంగాణభవన్ ఆవరణలోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు.
సీఎం కేసీఆర్కు నేతల అభినందనలు
సీఎం కేసీఆర్ సమావేశ మందిరంలో కాలుమోపగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ విజయదశమి సందర్భంగా దుర్గామాత ఆలయంలో పూజచేసిన కంకణాన్ని సీఎం కేసీఆర్ ముంజేతికి కట్టారు. హోం మంత్రి మహమూద్ అలీ సీఎం భుజానికి దట్టి కట్టారు. పార్టీ నేత మూల విజయారెడ్డి సీఎం కేసీఆర్కు వీర తిలకం దిద్దారు. ‘దేశ్ కా నేత కేసీఆర్’ అని నినాదాలు చేశారు. గులాబీ శ్రేణులు బైక్ర్యాలీలతో తెలంగాణ భవన్ వద్ద సందడి చేశారు. సీఎం కేసీఆర్కు కుమారస్వామి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాలువా కప్పి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపి ప్రగతిభవన్లో భోజనానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. ఉదయం 11 నుంచి 2 గంటల వరకు తెలంగాణ భవన్ లో ఉద్వేగభరిత వాతావరణం నెలకొన్నది.
1.19కి బీఆర్ఎస్ తీర్మానం ఆమోదం ప్రకటన
టీఆర్ఎస్ పేరు మార్పు కోసం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకవాక్య తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవ ఆమోదం తెలుపడంతో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సరిగ్గా 1.19 గంటలకు ‘భారత్ రాష్ట్ర సమితి’ పేరును ప్రకటించారు. సమావేశ మందిరంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘సీఎం కేసీఆర్ కో జయహో..దేశ్ కా నేత కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్ లోపలా, బయటా పటాకుల మోత హోరెత్తింది.