ముషీరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జెండా పండుగ, సంబురాలు నిర్వహించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని కూడళ్లు, చౌరస్తాలను ముస్తాబు చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
మంగళవారం గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ల వారిగా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు పార్టీ సీనియర్లతో కలిసి జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఆగస్టు 3 నుంచి డివిజన్ల వారిగా అనుబంధ, బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, 11నుంచి 20 వరకు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత నియోజకవర్గ సమన్వయ కమిటీలు, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఈ నెలాఖరు నాటికి అన్ని కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. డివిజన్కు వంద మంది వరకు ఆయా కమిటీలలో స్థానం కల్పించనున్నట్లు చెప్పారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి పదవుల పంపిణీలో ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎరం శ్రీనివాస్, ముఠా నరేష్, దీన్దాయల్రెడ్డి, శివముదిరాజ్, బి.శ్రీనివాస్రెడ్డి, వల్లాల శ్రీనివాస్, బింగి నవీన్కుమార్లు పాల్గొన్నారు.