న్యూఢిల్లీ: రష్యా జాతీయుడ్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్ట్ చేశారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్ష సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్పై అతడ్ని ప్రశ్నిస్తున్నారు. జేఈఈ పేపర్ లీక్ కేసులో రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్ కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపించింది. జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ప్లాట్ఫారమ్ ఐలియన్ సాఫ్ట్వేర్ను ట్యాంపరింగ్ చేయడానికి నిందితులకు అతడు సహకరించినట్లు పేర్కొంది.
కాగా, గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ, దేశం విడిచిపోయిన రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్పై లుకౌట్ నోటీస్ జారీ చేసింది. అయితే సోమవారం అతడు కజకిస్థాన్లోని అల్మాటీ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నాడు. లుకౌట్ నోటీస్ ఉండటంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని సీబీఐ అధికారులకు అప్పగించారు. దీంతో మిఖాయిల్ షార్గిన్ను సీబీఐ కార్యాలయానికి తరలించిన అధికారులు జేఈఈ మెయిన్స్ సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్పై ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు అఫినిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేతోపాటు ఈ పరీక్షలో అవకతవకలకు పాల్పడిన ఇతర వ్యక్తులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. భారీగా డబ్బులిచ్చి హర్యానాలోని సోనేపట్లోని పరీక్షా కేంద్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు సాంకేతికంగా సహకరించిన దానిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.