CBI Charge Sheet | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ `యెస్` బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బ్యాంక్ మాజీ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్, అవంతా గ్రూప్ ప్రమోటర్ గౌతం థాపర్లపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. రూ.466.51 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో రాణా కపూర్, గౌతం థాపర్లపై ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది.
గతేడాది జూన్ రెండో తేదీన కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు సీబీఐ.. రాణా కపూర్ పేరు అనుమానితుల జాబితాలో చేర్చలేదు. కానీ, ఈ కేసు విచారణలో అతని పాత్ర తేలిందని సీబీఐ పేర్కొంది.
సీబీఐకి యెస్ బ్యాంక్ సీఈవో ఆశీష్ వినోద్ జోషి ఫిర్యాదు చేశారు. గౌతం థాపర్తోపాటు ఓయిస్టర్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఓవీపీఎల్) డైరెక్టర్లు రఘుబీర్ కుమార్ శర్మ, రాజేంద్ర కుమార్ మంగళ్, తాప్సీ మహాజన్, అవంతా రియాల్టీ, ఝాబువా పవర్ లిమిటెడ్ సంస్థలకు చెందిన గుర్తు తెలియని ఎగ్జిక్యూటివ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఢిల్లీలో విలాసవంతమైన ఆస్తి కొనుగోలు కోసం యెస్ బ్యాంక్లోని ప్రజల నిధులను దారి మళ్లించారన్న అభియోగంపై రాణా కపూర్, గౌతం థాపర్లపై మరో కేసు నమోదైంది.