విజయవాడ: సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో తన డేరింగ్ డ్యాషింగ్ పనులతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడాయనే ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ని సెల్ఫీ తీసుకుంటాను అని అడిగి మరీ సెల్ఫీ తీసుకుని భద్రపరుచుకున్నాడు. అంతగా ఆయన్ను ఇష్టపడేంత పనేం చేశారనే కదా మీ అనుమానం. నిజంగా ఆయన చేసిన గొప్ప కార్యానికి మనం కూడా ఆయన్ని కలిసినప్పుడు సెల్ఫీ తీసుకోవాల్సిందే.
విజయవాడ విమానాశ్రయంలో హెడ్ కానిస్టేబుల్ బోస్ విధుల్లో ఉన్నారు. అంతలో అక్కడకు వచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ.. ఆయనను చూడగానే విష్ చేశారు. అనంతరం గొప్ప పని చేసిన ఆ వ్యక్తితో ఫొటో దిగి పదిలంగా దాచుకోవాలనుకున్నాడు. ‘బోస్.. ఒక్క సెల్పీ’ అని అడిగాడు. అంత గొప్ప వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకునేందుకు అడగ్గానే బోస్కు కాస్సేపు మాట రాలేదు. సరే సార్ అని నవ్వుతూ లక్ష్మీనారాయణతో ఫొటో దిగారు.
ఇంతకీ హెడ్ కానిస్టేబుల్ బోస్ చేసిన గొప్ప పనేంటంటే.. గతంలో ఏడు నెలల చిన్నారిని దత్తత తీసుకున్నాడు. ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ప్రస్తుతం ఖమ్మంలో వైద్యవిద్యనభ్యసించేలా తీర్చిదిద్దాడు. చిన్నారిని దత్తత తీసుకునేందుకు బోస్ను డీఐజీ పాల్రాజ్ ప్రోత్సాహించారు. ఇలాంటి వ్యక్తితో ఫొటో దిగడాన్ని గర్వంగా భావిస్తున్నానంటూ ఫొటోతో పాటు మ్యాటర్ను తన ట్విటర్ ఖాతాలో లక్ష్మీనారాయణ పోస్ట్ చేశారు.
ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన వీవీ లక్ష్మీనారాయణకు బోస్ ఆదర్శంగా నిలువడం సంతోషదాయకం. బోస్ మరెందరికో ఆదర్శం కావాలని మనమూ ఆశిద్దాం.