రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ కేసు నమోదు చేయగా.. రాంచీలోని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పీకే శర్మ కేసును విచారించి, తీర్పును వెలువరించారు. తిర్కీ ఆదాయానికి మంచి రూ.6.28లక్షలు సంపాదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆగస్ట్ 1, 2010న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై సీబీఐ కేసు నమోదు చేసింది. మందార్ ఎమ్మెల్యేగా 2005 నుంచి జూన్ 2009 వరకు రూ.6.28లక్షలు ఆదాయానికి మించి సంపాదించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున 21 మంది సాక్షులు, డిఫెన్స్ తరఫున ఎనిమిది సాక్షులను హాజరుపరిచారు. సామాజిక కార్యకర్త రాజీవ్ శర్మ 2009లో దిగువ కోర్టులో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయగా.. ట్రయల్స్ కోర్టు జూలై 1, 2009న విచారణకు ఆదేశించింది.