న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిధుల మల్లింపు కుంభకోణం కేసులో ఆనంద్ సుబ్రమణియంను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు, మాజీ గ్రూప్ ఆపరేషన్స్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియం.. సంస్థకు సంబంధించిన నిధులను అక్రమ మార్గాల్లో విదేశాలకు మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆనంద్ సుబ్రమణియంను సీబీఐ అధికారులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చిత్రా రామకృష్ణను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఆమె ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
2013 నుంచి 2016 మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ పనిచేశారు. హిమాలయాల్లో నివసించే ఓ యోగితో సూచనలతో ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్తో పాటు పలు కీలక పదవుల్లో క్యాపిటల్ మార్కెటింగ్పై ఎలాంటి అవగాహన లేని ఆనంద్ సుబ్రమణియంను నియమించారని సెబీ దర్యాప్తులో ఇటీవల తేలింది.
ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్గా ఆనంద్ సుబ్రమణియం నియామకం, ఆ వెంటనే ప్రమోషన్లు తదితర అంశాలపై చిత్రా రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. ఇదే కేసులో ఢిల్లీలోని ఓపీజీ సెక్యూరిటీస్ ప్రమోటర్ సంజయ్ గుప్తాపైనా కేసు నమోదైంది. సంజయ్ గుప్తా ఎన్ఎస్ఈ సర్వర్ ఆర్కిటెక్చర్గా పని చేశారు. గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగం. ఎన్ఎస్ఈ, సెబీల్లో పని చేసిన, చేస్తున్న మరి కొందరిని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.