కరోనా మహమ్మారి భారత్లో ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దాదాపు అదే స్థాయిలో రోగులు కోలుకుంటున్నారు. అయితే, వైరస్ నుంచి కోలుకున్నా.. మళ్లీ దాని బారినపడే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం కరోనా నుంచి రక్షించడంలో టీకాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని నిరూపించినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో వంద శాతం భద్రత ఇవ్వలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ మనతో పాటు చుట్టూ ఉన్న వారు దాని బారినపడకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారంతా మొదట తమ టూత్ బ్రష్ను మార్చాలని సలహా ఇస్తున్నారు. దంతాలు శుభ్రం చేసుకునేందుకు పాత బ్రష్ను వినియోగించడం తిరిగి వైరస్ సోకే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.
వాస్తవానికి దేశంలో ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్న వారికి వైరస్ మళ్లీ సోకింది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైతం తిరిగి వైరస్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగానే.. థర్డ్ వేవ్పై చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో చాలా మంది సాధారణ వాష్ రూములను వినియోగిస్తున్నారని.. కరోనా నుంచి కోలుకున్న అనంతరం పాత బ్రష్లను వినియోగించడం ద్వారా వారితో పాటు కుటుంబ సభ్యులకు సైతం హాని కలిగిస్తాయని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీలోని లేడి హార్డింగ్ మెడికల్ కాలేజీకి చెందిన డెంటల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ ప్రవీణ్ మెహ్రా మాట్లాడుతూ టూత్ బ్రష్లతో పాటు టంగ్ క్లీనర్లు సైతం మార్చాలని సూచించారు. అలాగే హెల్త్కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ మాట్లాడుతూ.. ఎలాంటి సీజనల్గా వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబు నుంచి కోలుకున్న వారు సైతం బ్రష్లు, టంగ్ క్లీనర్లు మార్చాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా తిరిగి ఫ్లూ సోకే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే బాత్రూంలో వినియోగించే ప్రతిదాన్ని మార్చాలని, లేకపోతే తిరిగి సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వైరస్ చిన్న బిందువులు దగ్గు, తుమ్ము మొదలైన వాటి ద్వారా వైరస్ సోకిన వ్యక్తి నోటి నుంచి బయటకు వస్తాయి. తర్వాత చుట్టు పక్కల ఉన్న ఉపరితలాలను కలుషితం చేస్తాయి. దీనికి సంబంధించి, డాక్టర్ భూమికా మదన్ మాట్లాడుతూ.. లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత అందరు టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చాలి. నోటిలో ఉన్న వైరస్, బ్యాక్టీరియాను తొలగించేందుకు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి గార్లింగ్ చేయాలని సూచించారు. ఇది నోటిలో ఉన్న ఇన్ఫెక్షన్లను బయటకు పంపేందుకు ఉత్తమమ మార్గమని తెలిపారు. అలాగే అనేక రకాలైన మౌత్ వాష్లు, బెటాడిన్ గార్లింగ్ లిక్విడ్ అందుబాటులో ఉన్నాయని, వాటిని సైతం వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు.