హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం వివిధ రూపాల్లో వెన్నాడుతూ నే ఉన్నది. కొవిడ్ సోకిన అనంతరం చాలామంది గుండె, కిడ్నీ, కాలేయం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా కారణం గా మారిన జీవనశైలి మనిషి శారీరక మార్పులపై కూడా ప్రభావం చూపిస్తున్నది. నిర్ణీత వయసు కంటే ముందుగానే రజస్వల (ఎర్లీ ప్యూబర్టీ) అవుతున్న బాలికల సంఖ్య క్రమం గా పెరుగుతున్నది. కరోనాకు ముందుతో పోలి స్తే అనంతర కాలంలో ఎర్లీ ప్యూబర్టీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్టు ఓ మెడికల్ సర్వే వెల్లడించింది. కరోనాకు ముందు నెలకు 10 కేసులు కనిపిస్తే.. కొవిడ్ అనంతరం నెల కు 30 కేసులు కనిపిస్తున్నట్టు వివరించింది. భారత్, ఇటలీ, అమెరికా, టర్కీల్లో ఈ కేసులు అత్యధికంగా పెరిగినట్టు పేర్కొన్నది. సాధారణంగా బాలికలు 13-15 ఏండ్ల మధ్య రజస్వల అవుతారని వైద్యనిపుణులు చెప్తున్నారు.
బరువు ఆధారంగానే రజస్వల
సాధారణంగా మెదడు మన శరీరం ఎత్తు ను పరిగణనలోకి తీసుకోదు. శరీర బరువుని మాత్రమే పరిగణనలోకి తీసుకొంటుంది. శరీరంలో హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి నియంత్రిస్తుంది. శరీరం బరువు ఒక నిర్ణీత స్థాయికి చేరుకోగానే ఈ గ్రంథి అప్రమత్తమై ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. దీంతో బాలికలు రజస్వల అయ్యి, నెలసరి ప్రారంభమవుతుంది. రజస్వల కావడం అనేది బాలికల శరీర బరువుపై ఆధారపడి ఉంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.
ముందస్తు రజస్వలకు ప్రధాన కారణాలు
ముందస్తు రజస్వలకు ప్రధాన కారణాలు ఊబకాయం, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత. కరోనా నేపథ్యంలో చాలామంది పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం వంటివి పెరిగాయి. లాక్డౌన్లతో జనజీవనం స్తంభించింది. పాఠశాలలు మూతపడటంతో పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాస్ల వల్ల ఒకేచోట గంటల తరబడి కూర్చోవాల్సిన పరిస్థితి. ఆటపాటలు లేక శారీరక శ్రమకు దూరమయ్యారు. ఈ కారణాల వల్ల పిల్లల్లో మెటాబాలిజంపై తీవ్ర ప్రభావం పడి, బరువు పెరిగి ఊబకాయం సమస్య తలెత్తినట్టు వైద్యనిపుణులు వివరించారు. అధిక బరువు వల్ల బాలికల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ముందస్తు రజస్వల అవుతున్నట్టు పేర్కొన్నారు.
కరోనా తరువాత ఎర్లీ ప్యూబర్టీ కేసులు పెరిగాయి
ముందస్తు రజస్వల కేసులను పదేండ్లుగా చూస్తున్నాం. కరోనాకు ముందు కూడా ఎర్లీ ప్యూబర్టీ కేసులు ఉన్నాయి. కరోనా తరువాత 10 నుంచి 15% పెరిగాయి. కరోనా వల్ల మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే కారణం! పిల్లల్లో శారీరక శ్రమ తగ్గింది. ఓవర్ న్యూట్రీషియన్ ఫుడ్ తీసుకోవడం పెరిగింది. ఈ కారణాలన్నీ పిల్లల్లో బరువు పెరిగి ఒబేసిటీకి దారితీస్తున్నాయి. దీంతో ఎర్లీ ప్యూబర్టీ కేసులు పెరుగుతున్నాయి.
– డాక్టర్ అనగాని మంజుల, చీఫ్ గైనకాలజిస్టు, కేర్ దవాఖాన
లాక్డౌన్లో ఓవర్ ఫీడింగ్ వల్లనే..
వైరస్ భయంతో చాలామంది తల్లిదండ్రులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పిల్లలకు ఓవర్ ఫీడింగ్ ఇస్తున్నారు. పిల్లలు కూడా జంక్ఫుడ్, చాక్లెట్లు, పాల ఉత్పత్తులు, ఫ్యాట్ ఫుడ్, నాన్వెజ్ వంటివి ఎక్కువగా తీసుకొంటున్నారు. తిండికి తగినట్టుగా శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడంతో పిల్లల్లో బరువు పెరిగి, ఒబేసిటీ వచ్చేసింది. దీంతో 13-14 ఏండ్లలో రావాల్సిన ప్యూబర్టీ పదేండ్ల లోపే వస్తున్నది.
–డాక్టర్ శిల్పిరెడ్డి, గైనకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్, కిమ్స్ దవాఖాన