అమరావతి : ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహరాన్ని సృష్టించిన టీడీపీ, ప్రచారం చేసిన సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమిస్తుంది. ఈ మేరకు వైసీపీ పార్టీ తరుఫున పోలీసులకు ఫిర్యాదు చేయను న్నట్లు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
తప్పుడు ప్రచారంతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్లు తెలిపారు. ఎంపీ మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఫేక్ అని ఏపీ సీబీఐ చీఫ్ ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్పు అని ఏపీ సీబీఐ వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు.
తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై, ప్రభుత్వంలోని వ్యక్తులపై బురద చల్లడమే టీడీపీ ఆనవాయితీగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సంస్థ నివేదిక ఇచ్చిందంటూ ఫేక్ రిపోర్ట్ను ప్రచారం చేశారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని , అశ్లీలాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్నాడని ఆరోపించారు.