ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని మేం అనుకోవడంలేదు. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే వాళ్లు మొగ్గుచూపుతారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే చూడండి. ఆ పథకం ద్వారా అవసరమైన వారికి పని దొరుకుతున్నది. అలా పనిచేయగా వచ్చిన డబ్బుతో వాళ్లు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు కదా. ఇలాంటి పథకాలను కూడా ఉచితాల గాటన కట్టలేం. పనిచేయనిదే పళ్లెంలోకి అన్నం రాదన్న పెద్దల మాట తెలిసిందేగా.
– సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీలు ఇచ్చే హామీలు ఏవి ఉచితాల కిందకు వస్తాయో.. ఏవి రావో తేల్చడం కష్టమని అభిప్రాయపడింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు ఆత్మ గౌరవంతో బతికేందుకు దోహదపడుతున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి పథకాలను కూడా ఉచితాల కింద ఒకేగాటన కట్టలేమన్నది. ఉచితాల అంశాన్ని తేల్చడానికి ఒక కమిటీని వేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల ప్రకటనలకు ముకుతాడు వేయాలని, హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దుచేయాలని పేర్కొంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలను చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.