అమరావతి: ఏపీలోని స్థానిక సంస్థల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఓడుతామో.. గెలుస్తామో అని ఆలోచిస్తూ ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అస్వస్థతకు గురైంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె టీడీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి ధనలక్ష్మి ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ఉంది. కాగా కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి నువ్వా.. నేనా అన్నట్లు ఉత్కంఠ కొనసాగింది.
తొలి రౌండ్ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నా గెలుపా.. ఓటమా.. అనే భావన ఆమెను వెంటాడింది. చివరికి గెలిచినప్పటికీ.. మరింత ఉద్వేగానికి లోనై తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కౌంటింగ్ కేంద్రంలో ఉన్న అందరూ ఒకింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటికి తీసుకొచ్చారు. అనంతరం వైద్య సిబ్బంది పరిక్షించగా ఆమెకు బీపీ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అనంతరం ధనలక్ష్మిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.