న్యూఢిల్లీ : జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం భారత్ విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేసింది. మెరుగైన కొవిడ్ ప్రోటోకాల్స్ను దృష్టిలో పెట్టుకొని నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఆదివారం తెలిపింది. గత మంగళవారం భారత్ నుంచి అన్ని ప్రత్యక్ష వాణిజ్య, ప్రైవేటు ప్యాసింజర్ విమానాలపై ఆదివారం (సెప్టెంబర్ 26) వరకు నిషేధాన్ని పొడగించింది. గడువు ఇవాళ్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని తొలగించింది.
అయితే, కెనడా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కెనడా ఆమోదించిన జెన్స్ట్రింగ్ ల్యాబ్ నుంచి కొవిడ్ టెస్ట్ (మాలిక్యులర్) చేయించుకోవాలి ఉంటుంది. ఇందులో నెగెటివ్ వస్తేనే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. కెనడాకు విమానం బయలుదేరే 18 గంటల ముందు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్లో ఇతర ల్యాబ్ల్లో తీసుకున్న కొవిడ్ టెస్ట్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోరు.
పూర్తిగా టీకాలు తీసుకున్న ప్రయాణికులు అరైవ్ కెన్ (Arrivecan app) మొబైల్ యాప్ లేదంటే వెబ్సైట్లో సంబంధిత సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. దీన్ని అధికారులు ధ్రువీకరించి, విమానం ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. పరోక్ష మార్గం ద్వారా కెనడాకు ప్రయాణించే భారత ప్రయాణికులు తప్పనిసరిగా భారత్ నుంచి కాకుండా మూడో దేశం నుంచి కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ను చూపాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 30 నుంచి ఎయిర్ ఇండియా కెనడాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఎయిర్ కెనడా రేపటి నుంచి భారత్కు సర్వీసులు నడుపనుంది.