కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడుతల పోలింగ్ పూర్తయింది. శనివారం నాలుగో విడుతలో 44 స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. దక్షిణ బెంగాల్లోని హౌరా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, ఉత్తర బెంగాల్లోని అలీపుర్దువార్, కూచ్బెహార్ జిల్లాల పరిధిలోని సుమారు 1.15కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అధికారులు 15,940 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
నాలుగో విడుత ఎన్నికలు జరుగుతున్న జిల్లాల పరిధిలో ప్రచారం హోరెత్తింది. అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపట్టారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ భావిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా కాషాయ జెండా ఎగుర వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలను ప్రచార బరిలోకి దింపింది. హుగ్లీ, హౌరా జిల్లాల్లో జరిగిన మూడు సభల్లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే యూపీ తరహాలోనే రోమియో వ్యతిరేక బందాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు.
యోగీ వ్యాఖ్యలపై టీఎంసీ, వామపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. బెంగాల్లో శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని, మహిళలు సురక్షితంగానే ఉన్నారన్నారు. ఆయన తన సొంత రాష్ట్రంలో నేర కార్యకలాపాలపైనే ఆందోళన చెందాలని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ హితవు పలికారు. మరో వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం పలు రోడ్షోల్లో పాల్గొన్నారు. డోమ్జూర్లో రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ క్రమంలో అమిత్షాపై బెంగాల్ సీఎం మమత విమర్శనాస్త్రాలు సంధించారు. ‘గుజరాతీలు బెంగాల్ను స్వాధీనం చేసుకోవడాన్ని మేం అనుమతించం’ .. బెంగాల్ బెంగాల్లోనే ఉంటుంది. గుజరాత్కు చెందిన గూండాలు బెంగాల్ను స్వాధీనం చేసుకోనివ్వం’ అన్నారు.