పెట్రోల్తో నడిచే వాహనాల అమ్మకాలను నిషేధించిన మొదటి యూఎస్ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. 2035 తర్వాత పెట్రోల్ కార్ల అమ్మకాలను బంద్ చేస్తున్నట్టు ఆ రాష్ట్రం ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ‘కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్’ (సీఏఆర్బీ) ఈ నిర్ణయం తీసుకుంది. 2035 నాటికి శిలాజ ఇంధనంతో నడిచే కార్ల అమ్మకాలను నిషేధించడంపై దృష్టి సారించి, కఠినమైన విధానాలను రూపొందించింది. అలాగే, నిర్ణయించిన గడువు తేదీలోగా కార్లను దశలవారీగా తొలగించే వ్యూహాలపై కూడా బోర్డు చర్చించింది.
‘ఇది చారిత్రాత్మక నిర్ణయం. 30 ఏండ్లలో సీఏఆర్బీ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం. ఇది కేవలం కాలిఫోర్నియాకు మాత్రమే కాదు.. దేశానికి, ప్రపంచానికే చాలా ముఖ్యమైనది.’ అని సీఏఆర్బీ బోర్డు సభ్యుడు డేనియల్ స్పెర్లింగ్ తెలిపాడు. కొత్త నిబంధనల ప్రకారం మొత్తం 35 శాతం కొత్త కార్లు, చిన్న పికప్ ట్రక్కులు, ఎస్యూవీలు 2026 నాటికి జీరో ఎమిషన్ను కలిగి ఉండాలి. 2030 నాటికి 68 శాతం, 2035 నాటికి పూర్తిగా 100 శాతం జీరో ఎమిషన్ ఉండేలా నిబంధనలు రూపొందించారు .