న్యూయార్క్: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ భారత్ నుంచి 120 కోట్ల డాలర్ల (సుమారు 9 వేల కోట్ల రూపాయల) పరిహారం వసూలుకు ఎయిర్ ఇండియా కంపెనీ ఆస్తుల జప్తునకు కోర్టులను ఆశ్రయించింది. పేరుకే ఎయిరిండియా విడిగా ఉన్నప్పటికీ చట్టపరంగా అది భారత ప్రభుత్వం నుంచి విడదీయరాని భాగమని పేర్కొన్నది. న్యూయార్క్ దక్షిణ జిల్లా న్యాయస్థానంలో ఈ దావాను శుక్రవారం కెయిర్న్ దాఖలు చేసింది. చమురు అన్వేషణ రంగంలోని కెయిర్న్ కంపెనీ భారత ప్రభుత్వంతో తలెత్తిన వివాదంలో ఎయిరిండియా ఆస్తుల జప్తునకు ప్రయత్నించడం గమనార్హం. ఎయిరిండియా దీనిపై స్పందించలేదు. భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి మాత్రం ఇంకా ఇందుకు సంబంధించి ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. నోటీసులు అందుకున్న తర్వాత ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యల నుంచి రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని వివరించారు. కెయిర్న్ దావాతో ఎయిరిండియా ప్రైవేటీకరణకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడుతుందని చెప్పొచ్చు. నిజానికి ఈ కేసు ఇండియా కెయిర్న్ నుంచి 2006లోవసూలు చేసిన కేపిటల్ గెయిన్స్కు సంబంధించినది. భారత్ అక్రమంగా పాత తేదీ నుంచి పన్ను వసూలు చేసినట్టు ఆరోపించిన కెయిర్న్ 120 కోట్ల డాలర్ల పరిహారం రాబట్టుకునేందుకు కేసు వేసి విజయం సాధించింది. ఇప్పుడు ఆ పరిహారం రాబట్టుకునేందుకు ఎయిరిండియా ఆస్తులను జప్తు చేసుకునే వీలు కల్పించాలని దావా వేసింది. భారత ప్రభుత్వం విదేశాల్లోని బ్యాంకు శాఖలకు నగదు నిల్వలను జప్తు నుంచి సురక్షితం చేయమని ఇదివరకే ఆదేశించింది. దాంతో కెయిర్న్ ఇప్పుడు ఎయిరిండియా వెంట పడుతున్నది. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా కోర్టుల్లోనూ పరిహారం రాబట్టుకునే దావాలు వేసేందుకు కెయిర్న్ ప్రయత్నాలు చేస్తున్నది.