హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన, సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ఠం తదితర అంశాలపై క్యాబినెట్ సబ్కమిటీ సుధీర్ఘంగా చర్చించింది.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. దరఖాస్తులు పరిశీలించి పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పినట్లు వివరించారు. కార్డుల్లో మార్పులు, చేర్పుల అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎంకి సిఫారసు చేయనున్నట్లు చెప్పారు. మరణించిన వారి పేర్లు తొలగించాల్సి ఉందన్నారు.
స్మార్ట్ కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. 1,498 రేషన్ దుకాణాలు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయని.. డీలర్ల నియామకంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. డీలర్ల కమీషన్ పెంపు అంశంపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రికి నివేదించి, సీఎం నిర్ణయానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.