హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం సమావేశమైన విషయం తెలిసిందే. సుమారు ఏడు గంటల పాటు పలు అంశాలపై సీఎం, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఇకపై రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2గంటలకు మరోమారు సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం చర్చించనుంది. కొత్త జోనల్ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్ ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్జీవో, టీజీవో విజ్ఞప్తిపై కేబినెట్లో చర్చ సాగింది. గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్కు నివేదిక సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్టు చేయాలన్నారు. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్లో ప్రధానంగా చర్చించారు. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను సీఎం మంజూరు చేశారు.
అలాగే నీటి ఎద్దడి నివారణ చర్యలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా లే అవుట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా లే అవుట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అన్వేషించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సైతం మంత్రివర్గం చర్చించింది. సీఎం ఆదేశాల మేరకు ఏడు జిల్లాల్లో పర్యటించిన అధికారులు.. ఈ మేరకు నివేదికను కేబినెట్కు సమర్పించారు.
ఈ సందర్భంగా మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాలపై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషధాల లభ్యత సహా థర్డ్ వేవ్కు సంబంధించిన సన్నద్ధతపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేబినెట్కు వివరణ ఇచ్చారు.కరోనా నియంత్రణకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే పలు అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో, మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.