న్యూఢిల్లీ : దేశ మౌలిక రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా రూ.100లక్షల కోట్ల ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం.. దాని అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పథకం అమలు, పర్యవేక్షణ, మద్దతు యంత్రాంగం ఏర్పాటు సహా ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్కు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ‘ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) మల్టీ మోడల్ కనెక్టివిటీని అందించేందుకు అమలు, పర్యవేక్షణ.. మద్దతు యంత్రాంగానికి సంబంధించిన సంస్థాగత చట్రంతో సహా పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను ఆమోదించింది’ అని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
రవాణా ఖర్చులు తగ్గించి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు.. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం ప్రధాని 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్ జాతీయ మాస్టర్ ప్లాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో 18 మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా సాధికార బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వివిధ మంత్రిత్వశాఖల నెట్వర్క్ ప్రణాళిక విభాగం అధిపతులకు ప్రాతినిథ్యం కల్పిస్తూ బహువిధ నెట్వర్క్ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటుకానుంది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖలోని లాజిస్టిక్ విభాగంలో ఏర్పాటు చేసే సాంకేతిక మద్దతు విభాగం ఈ గ్రూప్నకు సహకారం అందించనున్నది. ఈ గ్రూప్లో రవాణా, రైల్వే, విమానయానం సహా మౌలిక రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు.