టాప్ వన్ ట్రెండెంగ్లో హ్యాష్ ట్యాగ్
లక్ష ట్వీట్లతో మోదీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టిన నెటిజన్లు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా మరోసారి హోరెత్తింది. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బై బై మోదీ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఈ హ్యాష్ట్యాగ్ ఏకంగా లక్షకు పైగా ట్వీట్లతో ట్రెండింగ్లో తొలి స్థానంలో నిలిచింది. మోదీ అన్ని విధాలుగా విఫలమయ్యారని ట్వీట్ చేస్తూ, బై బై మోదీ హ్యాష్ట్యాగ్ను జత చేశారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఇందుకు ప్రధాని మోదీ అస్తవ్యస్థ, అసమర్థ ఆర్థిక విధానాలే కారణం. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు.
మోదీ అసమర్థత వల్ల నిరుద్యోగ రేటు 8.1 శాతానికి పెరిగింది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ఎరువుల ధరలు పెంచి సబ్సిడీలను ఎత్తేసి రైతులపై భారం మోపినందుకు బై బై మోదీ’ అంటూ ట్వీట్లు చేశారు. మత రాజకీయాలు, విద్వేషాలు రెచ్చగొట్టడంపైనా తీవ్రస్థాయిలో విమర్శించారు. అదానీ, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మేలుపై తమదైన శైలిలో చురకలు అంటించారు. శ్రీలంకలో అదానీ వ్యాపారం కోసం మోదీ మధ్యవర్తిత్వం వహించడం, దేశంలో కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి అదానీకి మేలుచేసేలా నిర్ణయాలు తీసుకోవటంపై మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ సర్కారు.. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పి, ఖర్చును డబుల్ చేసిందని మంత్రి నిరంజన్రెడ్డి ట్వీట్ చేశారు. ఉక్రెయిన్లో యుద్ధం సందర్భంగా అక్కడి భారతీయులను తరలించడంపై మోదీ ప్రభుత్వం చేసుకొన్న ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. దేశానికి సేవ చేసే నాయకుడు కావాలి కానీ పబ్లిసిటీ కోసం పాటుపడే నాయకుడు వద్దంటూ ట్వీట్ చేశారు.