ముంబై : మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వంతెనను దాటుతున్న సమయంలో ఆర్టీసీకి చెందిన బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ఈ ఘనటలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఉమర్ఖేడ్ తహసీల్లోని దహ్గావ్ వంతెన వద్ద ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సు నాగ్పూర్ నుంచి నాందేడ్ వెళ్తోంది. నీటితో నిండిన వంతెనను దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బస్సు సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకువెళ్లి బోల్తాపడిందని అధికారులు పేర్కొన్నారు.
గతకొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగి వంతెనపైకి నీరు చేరింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారని ఉమర్ఖేడ్ తహసీల్దార్ ఆనంద్ డియోల్గావ్ పేర్కొన్నారు. వరద ఉధృతికి బస్సు కొట్టుకుపోతున్న సమయంలో ఇద్దరు ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ తర్వాత గల్లంతైన నలుగురిలో ఒకరిని రక్షించి, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురికి కోసం గాలిస్తున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపారు.