రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ తీసుకువచ్చిన టీఎస్ బీపాస్కు ఆదరణ లభిస్తున్నది. గతేడాది నవంబర్ 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినా, అంతకు ముందున్న ఆన్లైన్ వ్యవస్థ అయిన డీపీఎంఎస్ విధానంలోనూ ఇప్పటి వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీతోపాటు హెచ్ఎండీఏ, ఇతర మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులన్నీ డీపీఎంఎస్ ద్వారా స్వీకరించేవారు. వీటిలో 500 మీటర్ల పైబడి ఉన్న స్థలంలో నిర్మాణాల కోసం డీపీఎంఎస్, టీఎస్బీపాస్ ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తులు వచ్చేవి. తాజాగా అన్ని దరఖాస్తులు ఇక నుంచి టీఎస్ బీపాస్ నుంచి తీసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ నెల 5 తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా భవన నిర్మాణం కోసం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.