లక్నో : రెంట్ చెల్లించలేదని ఏకంగా బ్యాంకుకు బిల్డింగ్ యజమాని తాళం వేసిన ఘటన యూపీలోని మీరట్ జిల్లా దురాలా ప్రాంతంలో వెలుగుచూసింది. అద్దె చెల్లించడం లేదని జిల్లా సహకార బ్యాంక్ సకోటి బ్రాంచ్కు యజమాని తాళం వేశాడు. భవన యజమాని కిరణ్పాల్ సింగ్ తన భవనాన్ని సహకార బ్యాంక్ బ్రాంచ్కు అద్దెకు ఇచ్చాడు.
అద్దె విషయమై గత ఎనమిదేండ్లుగా భవన యజమాని, బ్యాంక్కు మధ్య వివాదం నడుస్తోంది. అద్దె మొత్తం చెల్లించేవరకూ బ్యాంకును ఓపెన్ చేసేందుకు అనుమతించనంటూ యజమాని సింగ్ బుధవారం బ్యాంక్కు తాళం వేశాడు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ నచ్చచెప్పిన మీదట బ్యాంకు తాళం ఓపెన్ చేశాడు. 2007లో బ్యాంకుకు భవనాన్ని తాను అద్దెకు ఇచ్చానని ఒప్పందం కూడా ముగిసిందని యజమాని చెప్పుకొచ్చాడు.
బ్యాంకు అధికారులకు తాను పలుమార్లు దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒప్పందం ముగిసిన తర్వాత రెంట్ పెంచాల్సింది పోయి తగ్గించారని వాపోయాడు. బ్యాంకు అధికారుల తీరుతో విసిగిన యజమాని బ్యాంకుకు తాళం వేశాడు. చివరకు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ మణిందర్ పాల్ సింగ్ విజ్ఞప్తి చేయడంతో బ్యాంకును ఓపెన్ చేసేందుకు యజమాని అంగీకరించాడు.