వేసవిలో వడదెబ్బ తగులకుండా జాగ్రత్త పడాలి
ఏదైనా జబ్బు సోకితే వెంటనే సంప్రదించాలి
గేదెలకు ఖనిజ లవణాల మిశ్రమం తప్పని సరి : పశువైద్యాధికారులు
న్యాల్కల్, జూన్ 5 : వేసవిలో ఉష్ణోగ్రతలు రోజు, రోజుకూ తీవ్రమవుతున్నాయి. పాడిగేదెలకు తగిన సంరక్షణ చర్యలు చేపడితే అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చు. ఎండల తీవ్రత నుంచి సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువగా కాపాడితే అంత పాల ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉంటుందని పశు సంవర్ధక వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతతో పచ్చగడ్డి తక్కువగా ఉండడం వల్ల గేదెల్లో పోషకాహార లోపాలు ఏర్పడి, పునరుత్పత్తి ప్రక్రియ మందగిస్తుందన్నారు. పునరుత్పత్తి సామర్థ్యం బాగుంటేనే అధిక పాల ఉత్పత్తి సాధించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పాడి గేదెలను ఎండల నుంచి సాధ్యమైనంత వరకు కాపాడుకుంటేనే పాల ఉత్పత్తి సాధించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రస్తుత వేసవిలో పాడిగేదెలను సంరక్షించుకునే తగు జాగ్రత్తలు, పాల దిగుబడి సాధించే చర్యలపై ప్రత్యేక కథనం..
వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలి
వడదెబ్బ తగలకుండా వీలైనంత వరకు పాడి గేదెలకు రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకుం టే పశువులకు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీలు మాత్రమే. అంతకంటే ఎక్కువగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటాయి. నోట్లో లాలాజలం కూడా తగ్గిపోతుంది. నెమరు వేయడానికి వీలు పడదు. దాహం ఎక్కువై ఎక్కవగా నీళ్లు తాగుతాయి. ఫలితంగా మేత సరిగ్గా తినవు. శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయి లు తగ్గిపోయి నీరసించిపోతాయి. పాల ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.
పాడిగేదెలను ఇలా రక్షించుకోవాలి
వేసవిలో పశువుల పాక చుట్టూ పచ్చనిచెట్లు పెంచాలి. చెట్టు పెరగడం వల్ల చల్లని నీడ లభిస్తుంది. పాకలను ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. పాడిగేదెలకు గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. చెరువులు, కుంటల్లో వాటిని ఎండల నుంచి కాసేపు సేద తీర్చుకునేందుకు వీలు కల్పించాలి. ఎండ బాగా ఉన్నప్పుడు చల్లని నీటితో గేదెలను కడగటం తప్పకుండా చేయాలి.
తాగేందుకు పరిశుభ్రమైన నీటిని సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలి. పాకల చుట్టూ వట్టివేర్ల తడికలు, గోనెపట్టా ఏర్పాటు చేసుకుంటేనే మంచిది. పచ్చి గడ్డి లేదా మాగడి గడ్డి, ఎండుమేత సమృద్ధిగా గేదెలకు అందించేలా చూడాలి. ఎండలో పాడి గేదెలను మేపడానికి తీసుకెళ్లడంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పాడిగేదెలను ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకెళ్లడం మంచిది. గేదెలకు ఖనిజ లవణాల మిశ్రమం తప్పని సరిగా ఇవ్వాలి. ఎండల్లో పాడిగేదెలు తిరగకుండా పెంపకందారులు జాగ్రత్తలు వహించాలి.
తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి
పాడిగేదెల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే పాల దిగుబడిని సాధించవచ్చు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఎండ తీవ్రత నుంచి పాడిగేదెలను రక్షించుకోవాలి. మండలంలో 8,650 పాడిగేదెలు ఉన్నాయి. రోజుకు సగటున 3,400 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. పాడిగేదెలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు యజమానులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. పాడిగేదెలను ఎండలో గడ్డిని మేపేందుకు తీసుకెళ్ల్లడం మంచిది కాదు.. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. పాడిగేదెలకు తాగేందుకు స్వచ్ఛమైన తాగు నీరు, మేత అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. యజమానులు ఎప్పటికప్పుడు పాడిగేదెలను పరిశీలించాలి. ఏదైనా జబ్బు సోకితే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స అందించాలి.
–అజింక్యా,పశువైద్యాధికారి (న్యాల్కల్)