హైదరాబాద్ : యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు సదర్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టబోయిన నంద కిశోర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సదర్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో భాగంగా రూ. 5 కోట్లతో హర్యానా రాష్ట్రం నుంచి బాహుబలి దున్నపోతును తీసుకొచ్చినట్లు తెలిపారు.
గత మూడు రోజుల నుంచి చెప్పల్ బజార్లో ఈ బాహుబలి దున్నపోతుతో వినూత్న ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6వ తేదీన నారాయణగూడలో నిర్వహించే సదర్ వేడుకల్లో బాహుబలి దున్నపోతుతో విన్యాసాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సదర్ వేడుకలను తెలంగాణలోని జిల్లా, మండల కేంద్రాలతో పాటు ప్రతి గ్రామంలో వైభవంగా నిర్వహించాలని నంద కిశోర్ యాదవ్ పిలుపునిచ్చారు.