హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ ఫీజుల సవరణపై తెలంగాణ ఫీజ్, అడ్మిషన్స్ అండ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చేపట్టిన కసరత్తు ముగిసింది. ఈ ఏడాది బీటెక్ కనిష్ఠ ఫీజు రూ.45వేలు, గరిష్ఠ ఫీజు ఎంజీఐటీలో రూ.1.60లక్షలుగా ఖరారు చేసింది. 10 నుంచి 12 కాలేజీల్లో ఫీజులు లక్షకుపైగా ఉన్నట్టు టీఏఎఫ్ఆర్సీ అధికారులు వెల్లడించారు. నిరుడు బీటెక్ కనిష్ఠ ఫీజు రూ.35వేలు, గరిష్ఠ ఫీజు రూ.1.34లక్షలుగా ఉన్నది. ఈ ఏడాది పలు కాలేజీల అకౌంట్లల్లో మిగులు మొత్తం (సర్ప్లస్), ఫ్యాకల్టీ డెవలప్మెంట్, ప్లేస్మెంట్స్ కోసం యాజమాన్యాలు చూపించిన ఖర్చులను మినహాయించారు.
దాంతో పలు కాలేజీల్లో 2019 -22 బ్లాక్ పీరియడ్కు ఖరారుచేసిన ఫీజుల కన్నా భారీగా తగ్గాయి. ఇలా 90కి పైగా కాలేజీల్లో ఫీజులు గతం కంటే తగ్గినట్టు అధికారులు తెలిపారు. కాగా, పలు కాలేజీలు తప్పుడు లెక్కలు చూపాయని, ఆడిటింగ్ లోపాల కారణంగా ఫీజుల్లో భారీ తేడాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్ఆర్సీ అధికారులు ఈ నెల 20, 21, 22న 90కి పైగా కాలేజీలను విచారణకు పిలిచి పరిశీలించారు. వీటిన్నింటిపై కూలంకషంగా ఓ నివేదికను రూపొందించారు. శనివారం నిర్వహించే టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం ముందు ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నారు.
అధిక ఫీజు రాబట్టాలన్న ఒక కాలేజీ గుట్టు రట్టు అయింది. గతంలో చేపట్టిన విచారణ ప్రకారం టీఏఎఫ్ఆర్సీ పలు కాలేజీలకు ఫీజులు ఖరారుచేసింది. ఈ ప్రకియలో పలు కాలేజీలకు ఫీజులు భారీగా పెరిగాయి. అయితే, ఓ కాలేజీ.. తమ లెక్కల ప్రకారం ఫీజులు పెరుగుతాయని, కానీ తగ్గించారని టీఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేసుకొన్నది. దీంతో ఆ కాలేజీ ఆడిట్ నివేదికలను అధికారులు సమగ్రంగా పరిశీలించగా, ఫీజు రూ.10వేలు తగ్గింది. అనుమానం వచ్చి ఇదే తరహాలో 90కి పైగా కాలేజీలను పరిశీలిస్తే వాటిల్లోనూ తేడాలున్నట్టు అధికారులు గుర్తించారు.