జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శనివారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) పాకిస్తాన్ చొరబాటుదారుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సియాల్కోట్ నివాసి మొహమ్మద్ షాబాద్ (45) కదలికను బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. సరిహద్దు అవతల నుంచి ఆర్నియా సెక్టార్లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న సమయంలో గుర్తించి.. కాల్పులు జరిపారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఏమీ లభించలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్లో గత ఐదు రోజుల్లో ఐదు చొరబాట్లను సరిహద్దు భద్రతా దళం అడ్డుకున్నది. ఈ నెల 25న సాంబా జిల్లాలో ఇంటర్నేషనల్ బార్డ్ వెంట చొరబాటుదారుడి నుంచి ఎనిమిది కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. బలగాల కాల్పుల్లో చొరబాటుదారుడికి గాయాలయ్యాయి. ఆ తర్వాత తప్పించుకొని పాక్ వైపుగా పారిపోయాడు. ఈ నెల 23-24 మధ్య నౌషెరా సెక్టార్లో సైన్యం రెండుచోట్ల చొరబాట్ల ప్రయత్నాలను విఫలం చేసింది. ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నది. అదే సమయంలో భారీ ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నది.
25న ఉత్తర కశ్మీర్లోని ఉరీ సెక్టార్లోని కమల్కోట్ ప్రాంతంలో భారత సైన్యం మరో పెద్ద చొరబాటును విఫలం చేసి.. ముగ్గురు పాక్ ఉగ్రవాఉలను హతమార్చింది. చైనా తయారు చేసిన ఎం16 (9ఎంఎ) అసాల్ట్ రైఫిల్తో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నది. ఇదిలా ఉండగా.. చలికాలం ప్రారంభమయ్యే లోపు శిక్షణ పొందిన ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు పాక్ కుట్ర పన్నుతున్నట్లుగా సమాచారం. నియంత్రణ రేఖకు చాలా సమీపంలో ఉన్న డజన్ల కొద్దీ లాంచ్ ప్యాడ్లు చురుగ్గా ఉన్నాయని, దాదాపు 120-140 మంది శిక్షణ పొందిన పాక్ జాతీయ ఉగ్రవాదులు చొరబాటు కోసం సిద్ధంగా ఉన్నారని ఇటీవల అధికారులు తెలిపారు.